Osmania University Telangana | ఎంబీఏ ఈవినింగ్ కోర్సు ప్రవేశాల గడువు పొడగింపు
Osmania University Telangana | ఎంబీఏ ఈవినింగ్ కోర్సు ప్రవేశాల గడువు పొడగింపు
నోటిఫికేషన్ విడుదల
Hyderabad : ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం గడువును పొడగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి మంగళవారం తెలిపారు. ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం సెమిస్టర్ విధానంలో అందజేసే ఈ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓయూ అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ మేరకు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి, రూ.500 అపరాధ రుసుముతో సహా నియమిత రుసుమును ఈ నెల 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
పరీక్షను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. పై రెండు కోర్సులూ ఈవినింగ్ కోర్సులేనని చెప్పారు. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లని పేర్కొన్నారు. అయితే టీఎస్ ఐసెట్-2024లో అర్హత సాధించినవారు ఈ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రవేశాల కోసం నేరుగా దరఖాస్తు సమర్పించి, డైరెక్టుగా కౌన్సిలింగ్కు హాజరుకావచ్చని వివరించారు. ఈ రెండు కోర్సులకూ డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్లు ఎగ్జిక్యూటివ్ కేడర్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉండాల్సి ఉందని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లను సంప్రదించాలని తెలిపారు.
* * *
Leave A Comment